Tuesday, September 23, 2014

Zeebra fish- జీబ్రా చేపలు.

  •  




  •     జీబ్రా  చేపలు.


* తెలుపు నలుపు చారలతో ఉండే జీబ్రాల గురించి తెలుసు. మరి జీబ్రా చారలతో ఉండే ఈ చేప నీళ్లలో మిలమిల మెరిసిపోతూ భలే ముచ్చటగా దేహంపై నీలం రంగు చారలు అచ్చం జీబ్రా చారల్లానే ఉంటాయి. అందుకే వీటిని జీబ్రా చేపలంటారు. అసలు ఈ చేపపై చారలు ఎందుకు ఏర్పడతాయో శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.

* దేహంపై ఎవరో గీసినట్టే రంగు రంగుల్లో ఉండే ఈ చారల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరీక్షలు చేశారు. చివరకు ఈ చేపల్లోని వర్ణ కణాల వల్లే ఈ చారలు ఏర్పడతాయని తెలిసింది.

* ఈ చేపల్లో నలుపు, పసుపు రంగు కణాలు, వెండి వర్ణంలో ఉండే సిల్వరీ కణాలు ఉంటాయి. ఇవి పుట్టిన వెంటనే మెదడు నుంచి పసుపు కణాలు పుట్టుకొచ్చి చర్మాన్ని కప్పివేస్తాయి. తర్వాత రెండు, మూడు వారాలకు అవి పెరుగుతూ విస్తరిస్తాయి. తర్వాత వెన్నెముక నుంచి సిల్వరీ, నలుపు కణాలు ఏర్పడి చర్మం పొరల్లో కలిసిపోతూ చారల్ని ఏర్పరుస్తాయి. ఈ కణాలకు రంగు, ఆకారం మార్చే శక్తి కూడా ఉంటుంది. దాంతో శరీరంపై బంగారు వర్ణం చారల మధ్య నీలం రంగు వచ్చేలా చారల్ని ఏర్పరుస్తాయి. ఈ కణాలే చారలకు కారణమన్నమాట.

* ఈ పరిశీలన వల్ల పులి, జీబ్రా వంటి వాటిల్లో వాటి రంగు, చారల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

* జీబ్రా చేపల్ని ఎన్నో పరిశోధనల కోసం వాడతారు. ఎందుకంటే వీటి చర్మం పారదర్శకంగా ఉండి, మైక్రోస్కోప్‌ కింద చక్కగా కనిపిస్తుందిట. అంతేకాదు మన మెదడు జెనెటిక్‌ కోడ్‌తో పోలిస్తే జీబ్రా చేప మెదడుకు 90 శాతం సరిపోలుతుందిట.

* బంగారు, వెండి వర్ణంలో ఆకర్షణీయంగా ఉండే ఈ చేపలు ఎక్కువగా మన దేశంలోనే కనిపిస్తాయి. మంచి నీళ్లలో మాత్రమే ఉంటాయి. భలే అందంగా ఉండడంతో ఎక్కువగా అక్వేరియాల్లో పెంచుతుంటారు.

* ఇవి మొప్పల్ని, గుండె కండరాల్ని కూడా పునరుత్పత్తి చేసుకోగలవు. మనలానే వీటికి వెన్నెముక ఉంటుంది.

* వీటిల్లో మగ చేప జత కట్టిన ఆడ చేపతోనే ఉంటుందిట.

* సన్నగా ఉండే ఇవి రెండున్నర అంగుళాల పొడవుంటాయి.

 
  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com _

Dreadnoughtus schrani Dynosar -డ్రెడ్‌నాటస్ స్రాని డైనోసార్

  •  

  •  Dreadnoughtus schrani Dynosar- డ్రెడ్‌నాటస్ స్రాని డైనోసార్
 

పురాణ కథల్లో భారీ పరిమాణంతో ఉన్న రాక్షసుల గురించి వినే ఉంటారు. నిజంగా అంత పెద్ద డైనోసార్‌ ఒకప్పుడు భూమ్మీద బతికేవి . ఇది ఇప్పటివరకు బయటపడ్డ అతిపెద్ద డైనోల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మహా రాకాసి బల్లి ఏకంగా 85 అడుగుల పొడవుండేది. అంటే స్కూలు బస్సులు మూడు ఒకదాని తర్వాత ఒకటి పెడితే ఎంతుంటాయో అంత అనుకోవచ్చు. ఇక బరువు 65 టన్నులు. అంటే 65వేల కేజీలు. పన్నెండు ఆఫ్రికా ఏనుగుల బరువుతో సమానమన్నమాట. దీని ఎత్తు 30 అడుగులపైనే. ద్రవ్యరాశిలో భూమ్మీద బతికిన అన్ని జంతువులకన్నా ఇదే పెద్దదని పరిశోధకులు ఆశ్చర్యంతో చెప్పుకునేవారట .

* ఇంతకీ దీని పేరు చెప్పనేలేదు కదూ! dreadnoughtus schrani. దీనర్థం భయంలేనిదని. దీనికి శత్రువులంటూ ఏవీ ఉండేవి కాదట. అందుకే 'నో ఫియర్‌' అని పెట్టారు. శాస్త్రీయనామం పలకడానికి నాలుక తిరగట్లేదా? అందుకే ముద్దు పేరు డ్రెడ్‌ అని కూడా పెట్టారు.

* ఈ డైనో తోక 30 అడుగులు ఉండేది. మెడ 37 అడుగుల పొడవుండేది. ఇంకా నయం ఇదున్నప్పుడు మనముంటే కరకరా నమిలేసేదేమో! అనుకోకండి. ఎందుకంటే ఇది శాకాహారి. నిల్చున్న దగ్గర్నుంచే ఎటూ కదలకుండా ఎంత పెద్ద చెట్టు ఆకుల్నైనా ఆంఫట్‌ అనిపించేదిట.
* ఇంతకీ ఇది ఎక్కడ బతికేది? ఈ మధ్య డ్రెక్సెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అర్జెంటీినాలోని పాటగోనియా ప్రాంతంలో తవ్వకాలు జరిపితే వీటి శిలాజాలు బయటపడ్డాయి. ఇది వరకు దొరికిన ఏ డైనో అస్థిపంజరం దీనిలా పూర్తిస్థాయిలో లభించలేదట. ఈ డైనోకు చెందిన 16 టన్నుల బరువున్న శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి కంప్యూటర్లలో పెట్టి దీని రూపం ఎలా ఉండేదో వూహించారు.

* ఈ డైనో 7 కోట్ల 70 లక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరగాడిందని తెలుసుకున్నారు. ఇది నాలుగు కాళ్లతో ఉండే టిటనోసార్‌ జాతికి చెందినది.

* ఇది ఉన్నచోటి నుంచి ఎక్కువగా కదిలేది కాదు, దృఢమైన తోకే దీని ఆయుధం. తోకతో శత్రువుల్ని చటుక్కున బంధించేసేదిట. తిన్నది అరిగించుకోవడానికి పొట్టను అటూ ఇటూ ఊపడం వల్ల కొన్ని రకాల స్రవాలు విడుదలై, వాటితోనే ఆహారం అరిగి కావాల్సిన శక్తిని గ్రహించుకునేది.

* నదులు ఉప్పొంగి బాగా వరదలు రావడం వల్లే ఈ భారీ డైనో జాతి అంతమైందని తేలింది.

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _

Gaint Sloth-రాకాసి స్లోత్‌

  •  

  • Gaint Sloth-రాకాసి స్లోత్‌
* బద్ధకానికి మారుపేరైన స్లోత్‌లు  కదలడంలో నెమ్మదైనా  వీటి శరీర పరిణామక్రమం చాలా వేగంగా పెరుగుతుందట. స్లోత్‌లది వింతైన రూపం. రోజులో ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతాయి. బద్ధకానికి మారుపేరుగా పిలుస్తారు. అయితే ఈ జీవిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే ఒక కొత్త సంగతి తెలిసింది.

* ఇప్పటి స్లోత్‌లు కుక్కంత సైజు, ఎనిమిది కేజీల బరువుతో ఉంటాయి. కానీ 11వేల ఏళ్ల క్రితం ఏకంగా ఏనుగంత పెద్దగా ఉండేవి. వాటిని చూస్తే ఏ జీవికైనా హడలు పుట్టేదట. స్లోత్‌లు ఒకప్పుడు అంత పెద్దగా ఉండేవనే సంగతి గతంలోనే తెలుసు.

* ఇప్పుడు కొత్తగా బయటపడ్డ విషయమేంటంటే... వీటి శరీర పరిణామక్రమం చాలా వేగంగా పెరిగిందని. ఎంతంటే లక్ష ఏళ్లకోసారి వీటి బరువు 100 కేజీలు పెరిగేదిట. అంటే లక్షలాది ఏళ్ల క్రితం చిన్నగా ఉన్న స్లోత్‌లు క్రమంగా పెద్దగా పెరుగుతూ వచ్చి ఏనుగంత సైజుకు చేరుకున్నాయి.

* అయినా లక్ష ఏళ్లకు వంద కేజీల పెరుగుదల అంటే తక్కువేగా అంటారేమో! క్షీరదాల్లో మరే జీవి బరువు ఇంత వేగంగా పెరగలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

* ఏనుగంత పెద్దగా ఉన్న ఈ స్లోత్‌ జాతి పేరు megatherium, ఇవి ఉత్తర అమెరికా ఖండంలో తిరగాడేవి. వీటిని జెయింట్‌ స్లోత్‌ అంటారు. వీటి గోళ్లే ఒక అడుగు పొడవు ఉండేవి. అంటే కత్తుల్లా కనిపించేవి.

* జెయింట్‌ స్లోత్‌ జాతి 11,000 ఏళ్ల క్రితం వాతావరణ మార్పుల వల్ల పూర్తిగా అంతరించిపోయింది!
మీకు తెలుసా?
* ఇప్పుడున్న స్లోత్‌లలో 6 జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని రెండు వేళ్లవి, మరికొన్ని మూడు వేళ్లవి.
* స్లోత్‌లు ఇప్పుడు దక్షిణ అమెరికా అడవుల్లో మాత్రమే జీవిస్తాయి!
* ఇవి రోజులో 15 నుంచి 20 గంటలు నిద్రిస్తాయి. అదీ చెట్లమీదే!
* వారానికి ఒకసారి మూత్ర విసర్జనకు, జలకాలాటకు చెట్లు దిగి కిందికి వస్తాయంతే! వీటి నడక, చెట్లు ఎక్కడం చాలా నిదానంగా ఉంటుంది. నిముషానికి అయిదారు అడుగుల దూరం నడవగలవు!
* ఆహారం జీర్ణం కావడానికి సుమారు నెల రోజులు పడుతుంది!

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _

pudu deer-పుడూ జింక


  •  

  •  
మన పేజీలో కనిపిస్తున్న ఈ జీవిని చూస్తే అరే ఇదేదో వింతగా ఉందే ముద్దు ముద్దుగా జింక బొమ్మలా అనుకుంటున్నారా? ఇది నిజంగా జింకే. ప్రపంచంలోనే అతి చిన్న జింక జాతి. పేరు పుడూ. మనలో పొట్టి మనుషులున్నట్టే వీటి జాతిలో ఇదే పొట్టిదన్నమాట. ఈ మధ్యే పుట్టిన ఇది దాని పరిమాణం వల్లే ప్రముఖురాలైంది.

* దీన్ని చూడాలంటే న్యూయార్క్‌లోని క్వీన్స్‌ జంతు ప్రదర్శనశాలకు వెళ్లాల్సిందే.

* పుట్టినప్పుడు కేవలం అరకిలో బరువు మాత్రమే ఉంది. మామూలుగా అయితే పుడూ జాతి జింకలు 13 నుంచి 17 అంగుళాల ఎత్తు, 33 అంగుళాల వరకు పొడవుంటాయిట. కానీ ఇది అలా కాదు. పూర్తిగా పెరిగినా 23 అంగుళాల పొడవు, తొమ్మిది కిలోల బరువుకు మించదు.

* ఈ జాతి జింకలు ఎక్కువగా ఉండేది చిలీ, అర్జెంటీనా అడవుల్లోనే. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, వేటాడటం వంటి చర్యల వల్ల ప్రస్తుతం అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. అందుకే చిలీలో వీటి సంఖ్యను పెంచడానికి రక్షణ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే క్వీన్స్‌ జూలో వీటికి అనువైన పరిస్థితుల్ని ఏర్పాటు చేశారు. పైగా జూలో పుట్టిన మొదటి పుడూ జింక పిల్ల కూడా ఇదే తెలుసా?

* ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య సుమారు పది వేలలోపే!

* దీన్ని స్థానిక భాషలో 'మాపుడుంగన్‌' అని పిలుస్తారు. అలా ఈ జింకకు పుడూ అనే పేరొచ్చింది.

* ఇవి ఆకులు, కొమ్మలు, గడ్డి, క్యారెట్లు వంటి తింటూ బతికేస్తాయి.

* శత్రువులు కనిపించగానే చిందరవందరగా పరుగులు తీస్తూ క్షణాల్లో మాయమవుతాయిట.

* ముదురు ఎరుపు, గోధుమ రంగులో ఒత్తయిన బొచ్చుతో ఉండే వీటిల్లో రెండు ఉపజాతులుంటాయి.

* మామూలు జింకల కన్నా కాస్త భిన్నంగా వీటి తలపై రెండు కొమ్ముల్లాంటి భాగాలు ఉంటాయి. ఈ కొమ్ములు ఏడాదికోసారి ఊడిపోతూ మళ్లీ కొత్తగా వస్తుంటాయి. వీటికో బుల్లి తోక కూడా ఉంటుంది.

* పరిసరాల్ని పసిగట్టే చురుకుతనం ఎక్కువ. అంతేకాదు వేగంగా పరుగెత్తడం, చెట్లెక్కడం లాంటివి చేస్తుంటాయి.

  • ============================ 
Visit my website : Dr.Seshagirirao.com _

Mantis shrimp - మాంటీస్‌ ష్రింపు

  •  


  •  
కళ్లతో ఏం చేస్తాం? పరిసరాల్ని చూస్తాం...    కానీ ఓ జీవి మాత్రం కళ్లతోనే తనపై ఏ చూపు పడకుండా చేస్తుంది. కళ్లతో చూడ్డం తెలుసు. కానీ కళ్లతోనే కనిపించకుండా మాయమవ్వడం తెలుసా? వింటేనే విచిత్రంగా ఉన్నా రొయ్య జాతికి చెందిన మాంటీస్‌ ష్రింపు ఆ పనే చేస్తుంది. కళ్లతో కాంతులు వెదజల్లుతూ తనని తాను రక్షించుకుంటుంది. శత్రువుల చూపు తనమీద పడకుండా మాయ చేస్తుంది.
* ఆసక్తికరమైన ఈ సంగతులన్నీ శాస్త్రవేత్తలు వాటిపై చేసిన పరిశోధనలో బయటపడ్డాయి.

* మామూలుగా అయితే ఈ మాంటీస్‌ ష్రింపులు చురకత్తిలాంటి చూపులతో మనం చూడలేని రంగుల్ని కూడా పసిగట్టేస్తాయి. వీటిల్లో పెద్దవి శత్రువులపై దాడి చేసి, లేదంటే ముందే వాటి ఉనికిని గుర్తించి తప్పించుకుంటాయి. మరి ఇవి లార్వా దశలో ఉన్నప్పుడు బలహీనంగా ఉంటాయి కాబట్టి ఏం చేస్తాయో తెలుసా? కళ్లతోనే మాయ చేస్తాయి. నీటిలో చూడ్డానికి వీలు లేకుండా అదృశ్యం అవుతాయి. పారదర్శకంగా మారిపోతాయి.
* మేరీలాండ్‌ బల్టిమోర్‌ కౌంటీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు వీటి కళ్ల వెనుకున్న కిటుకు గురించి తెలుసుకోవడానికి పరిశోధన మొదలెట్టారు. ఆస్ట్రేలియాలోని లిజర్డ్‌ దీవిలో ఉన్న పరిశోధనశాలలో ఉంచి తెల్లని కాంతి కిరణాల్ని వాటిపై ప్రసరించేలా చేశారు.

* కాంతి కిరణాలు పడగానే మొదట ష్రింపు లార్వాలు వాటి కంటి పైభాగం నుంచి ఆకుపచ్చ కాంతుల్ని, తర్వాత కంటి కింది భాగం నుంచి నీలం రంగు కిరణాల్ని ప్రతిబింబించేలా చేశాయిట. అలా మెరిసే వీటి కళ్లు ప్రసరించే కాంతుల వల్లే అవి పరిసరాల్లో కలిసిపోయినట్టుగా ఉండి ఇతర జీవులకు కనిపించకుండా ఉంటాయన్నమాట.

* ఈ విన్యాసాలు ఫొటోలో బంధించడానికి వీలు పడకుండా ఉంటాయిట.

* ష్రింపులకు చూపు కూడా చాలా ఎక్కువే. అతినీలలోహిత కిరణాల్ని సైతం చూడగలవు. బయటకి పొడుచుకుని వచ్చినట్టు ఉండే వీటి కనుగుడ్లు దేనికదే తిరిగేలా ఉంటాయి.

* లార్వాలు ఎదిగాక కళ్లతోనే పరిసరాల్ని కూడా పసిగట్టి శత్రువును గుర్తిస్తాయిట. ఎంత దూరంలో ఉన్న శత్రువునైనా గంటకు 90కిలో మీటర్ల వేగంతో వెళ్లి చటుక్కున చంపేస్తాయి. అందుకే దీన్ని 'థంబ్‌ స్పిట్లర్‌' అంటారు. 

  • ============================ 
 Visit my website : Dr.Seshagirirao.com _